Posted on 2026-05-28 20:21:50
• ప్లాన్ భగ్నం చేసి అక్రమ ఆయుధంతో సహా ఆరుగురిని అరెస్ట్ చేసిన తాడ్వాయి పోలీసులు!
• పాత అప్పు ఎగవేసేందుకు కిడ్నాప్కు పథకం రచించిన నిందితులు
• పోలీసుల అప్రమత్తతతో భగ్నమైన భారీ నేర కుట్ర – అక్రమ ఫైర్ ఆర్మ్, రబ్బర్ బుల్లెట్లు స్వాధీనం.
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పి యం రాజేష్ చంద్ర ఐపిఎస్
డైలీ భారత్, కామారెడ్డి: తేదీ 27-05-2026 న తాడ్వాయి పోలీస్ స్టేషన్, కృష్ణాజీవాడి శివాలయం సమీపంలో కొంతమంది అనుమానితులు ఏదో నేరం చేయుటకు పన్నాగం వేస్తున్నారని విశ్వసనీయ సమాచారం రాగా వెంటనే తాడ్వాయి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి కృష్ణాజీవాడి గ్రామ శివాలయం వద్దకు వెళ్ళగా పోలీసు వారిని చూసి పరిపోతున్న వారిని పోలీసువారు వారు వెంబడించి అదుపులోకి తీసుకోవడం జరిగింది.
ఈ విషయములో కామారెడ్డి జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపిఎస్ ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి డీఎస్పీ యస్ శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, తాడ్వాయి ఎస్ఐ నరేష్, సదాశివనగర్ ఎస్ఐ మరియు వారి సిబ్బంది ఐటికోర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పీసీ యాదగిరి, సీసీఎస్ పీసీలు మైసయ్య, కిషన్ తదితరులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల ద్వారా జరిగే భారీ కుట్ర యొక్క పూర్తి సమాచారం మరియు అందులో ప్రమేయం ఉన్న వ్యక్తులు అందరినీ గుర్తించాలని ఆదేశాలు జారీచేయడం జరిగింది.
కేసు వివరాల్లోకి వెళ్తే…
కామారెడ్డి కి చెందిన భూస శ్రీనివాస్ అనే వ్యాపారవేత్తకు నిందితులైన నిట్టు నర్సింగా రావు, వడ్డే స్వామి, పులి ప్రశాంత్ గౌడ్ మరియు సూరం స్వామిలతో గతం నుంచి పరిచయం కలదు. వీరి మధ్య గతంలో ఆర్థిక లావాదేవీలు జరిగినవి. భూస శ్రీనివాస్ వద్ద పెద్ద మొత్తంలో నగదు ఉందని భావించిన నిందితులు, పాత ఆర్థిక బాకీలు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టవచ్చని దురుద్దేశముతో ఆయనను కిడ్నాప్ చేయాలని ముందస్తుగా పథకం రచించారు. కిడ్నాప్ను అమలు చేయడానికి ఒక ప్రాణాంతక ఆయుధం ఉంటే భూస శ్రీనివాస్ ని బయపెట్టి అతని వద్ద ఉన్న పెద్దమొత్తములోని నగదు తీసుకోవచ్చని నిందితులు భావించి మహారాష్ట్రలో అక్రమంగా తుపాకులు లభిస్తాయని వారికి పరిచయం ఉన్న అజయ్ మరియు వైభవ్ అనే వ్యక్తులను సంప్రదించగా, వారు నయ్గావ్కు చెందిన మారుతి గోకే అనే వ్యక్తి ద్వారా తుపాకీ కొనుగోలు చేయవచ్చని సూచించారు. దాంతో నిందితులు నర్సింగరావు మరియు ఒడ్డే స్వామి కలిసి తేదీ 12-05-2026న మహారాష్ట్రకు వెళ్లి అజయ్ హన్మంత రావ్ గోంగపాలే మరియు
వైభవ్ ప్రకాశ్ బరాడేవర్ సహకారంతో మారుతి ఘోకేను కలుసుకొని రూ.30,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా అడ్వాన్స్గా రూ.27,000 నగదు చెల్లించినారు. ఈ నేపథ్యంలో తేదీ 27-05-2026న మారుతి ఘోకే అందజేసిన తుపాకీని వైభవ్ ప్రకాశ్ బరాడేవర్ మరియు అజయ్ హన్మంత రావ్ గోంగపాలే కలిసి తీసుకుని కృష్ణాజివాడ గ్రామ సమీపానికి చేరుకుని నిందితులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్న సమయంలో తాడ్వాయి పోలీసులు చాకచక్యముగా వ్యవహరించి ఈ కిడ్నాప్ కుట్రను భగ్నం చేయడం జరిగింది. విచారణలో నిందితులు త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ధనికుడైన బుసా శ్రీనివాస్ను కిడ్నాప్ చేసి అతని కుటుంబ సభ్యుల నుండి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేయాలని కుట్ర పన్నినట్లు వెల్లడైంది. ఇందుకోసం మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ ప్రాంతానికి చెందిన వ్యక్తుల ద్వారా అక్రమ తుపాకీని కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడింది.
స్వాధీనపు వివరములు:
• 1. ఒక నల్ల రంగు ఫైర్ ఆర్మ్, 2. రబ్బర్ బుల్లెట్లు-5, 3. ఎయిర్ రైఫిల్ పెల్లెట్ బాక్సులు-2, 4. మొబైల్ ఫోన్లు-5,
• 5. ఒక హీరో స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్, 6. రెండు మంకీ క్యాప్స్, 7. మాస్కులు-3, 8. నైలాన్ తాడు, 9. పసుపు రంగు టేప్, 10 .నల్ల రంగు గాగుల్స్, 11. నగదు రూ.3,000/-
నిందితుల వివరాలు:
1. నిట్టు నర్సింగా రావు (A1) తండ్రి: నాగేందర్ రావు, వయస్సు: 55 సం.లు: చిట్యాల గ్రామం.
2. సూర స్వామి అలియాస్ వడ్డె స్వామి (A2) తండ్రి: సాయిలు, వ: 27 సం.లు, సంతాయిపేట్ గ్రామం.
3. పులి ప్రశాంత్ గౌడ్ (A3) తండ్రి: కృష్ణ గౌడ్, వయస్సు: 40 సం.లు, సంతాయిపేట్ గ్రామం
4. సురం స్వామి (A4) తండ్రి: భీమయ్య, వయస్సు: 40 సం.లు, చిట్యాల గ్రామం.
5. వైభవ్ ప్రకాశ్ బరాడేవర్ (A5) S/o ప్రకాష్ వయస్సు: 21 సం.లు, నాయగావ్, మహారాష్ట్ర.
6. అజయ్ హన్మంత రావ్ గోంగపాలే (A6) వయస్సు: 25 సం.లు, కొకులేగావ్, మహారాష్ట్ర,
నిందితుడు నిట్టు నర్సింగా రావు గతములో తాడ్వాయి పోలీస్ స్టేషన్ లోని హత్యా యత్నం కేసులో నేరస్తుదుగా ఉన్నాడు అని తెలిసినది. మిగిలివారివి కూడా పరిశీలిస్తున్నాము.
నిందితులపై తాడ్వాయి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 77/2026 కింద సెక్షన్ 61(2) బీఎన్ఎస్ మరియు 3, 4, 25(1AA) ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి ఈ కేసులోని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది. మరో నిందితుడు అయిన మారుతి ఘోకే , నాయగావ్, మహారాష్ట్ర పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. అంతరాష్ట్ర నేర ముఠాల పట్ల ప్రజలందరూ, ముఖ్యంగా వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. మీ పరిసరాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నా, లేదా అక్రమ ఆయుధాల సమాచారం తెలిసినా వెంటనే డయల్ 100 కు గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందించండి.
మీరిచ్చే ఒక చిన్న సమాచారం, ఒక పెద్ద నేరాన్ని అడ్డుకోవచ్చు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి. సురక్షిత సమాజ స్థాపనలో భాగస్వాములుకండి.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >