Posted on 2026-02-26 07:44:52
ఫరీద్పేట్ గ్రామంలో 24 సీసీ కెమెరాలను ప్రారంభించిన కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి ఐపిఎస్
డైలీ భారత్, కామారెడ్డి: మాచారెడ్డి మండలంలోని ఫరీద్పేట్ గ్రామంలో గ్రామస్తులు మరియు గ్రామ పాలకవర్గం సంయుక్తంగా సామాజిక బాధ్యతతో ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి గారు బుధవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఏఎస్పీ గారు, గ్రామ భద్రత కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం అభినందనీయమని తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసుల పనితీరుతో సమానమని, ఇది గ్రామ భద్రతకు నిరంతరం నిఘా ఉంచే ‘మూడో కన్ను’ లాంటిదని పేర్కొన్నారు. గ్రామంలోకి వచ్చే కొత్త వ్యక్తుల కదలికలు, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఏదైనా నేర సంఘటన జరిగినప్పుడు నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్ట్ చేయడంలో ఈ కెమెరాల దృశ్యాలు పోలీసులకు బలమైన సాక్ష్యాలుగా ఉపయోగపడతాయని, తద్వారా నేరస్థుల్లో భయం పెరిగి నేరాలు తగ్గుముఖం పడతాయని వివరించారు.
అనంతరం arrive alive కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కల్పించిన ఏఎస్పీ , వాహనదారులు ముఖ్యంగా యువత తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అతివేగం, అజాగ్రత్త కారణంగా అమూల్యమైన ప్రాణాలు కోల్పోవద్దని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాకుండా, మన ప్రాణ రక్షణ కోసం కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించి, తమ గ్రామ భద్రతలో భాగస్వాములుగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాచారెడ్డి ఎస్ఐ అనిల్, పోలీస్ సిబ్బంది, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పాలకవర్గ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ భద్రత కోసం స్వచ్ఛందంగా నిధులు సమకూర్చి సీసీ కెమెరాల ఏర్పాటు చేసిన గ్రామస్తుల చొరవను ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
చివరగా, ఫరీద్పేట్ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన గ్రామస్తుల సామాజిక బాధ్యతను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలు మరియు పోలీస్ శాఖ పరస్పర సహకారంతోనే నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, ఇతర గ్రామాలు కూడా ఫరీద్పేట్ను ఆదర్శంగా తీసుకొని తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాలని ఆయన సూచించారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >