| Daily భారత్
Logo




నకిలీ పోలీసుల ముఠా గుట్టురట్టు

News

Posted on 2026-06-03 18:58:44

Share: Share


నకిలీ పోలీసుల ముఠా గుట్టురట్టు

వ్యాపారులను టార్గెట్‌గా చేసుకుని హైటెక్ దోపిడీలు.. నలుగురు అరెస్ట్

హరియాణా సస్పెండెడ్ కానిస్టేబుల్ శిక్షణతో నేరాలకు పాల్పడిన ముఠా

ఖాకీ యూనిఫాంలు, ఫేక్ ఐడీలు, తుపాకులు, హ్యాండ్‌కఫ్స్ స్వాధీనం

కిడ్నాప్ చేసి రూ.5.26 లక్షలు దోచుకున్న నిందితులు

ట్రాఫిక్ చలాన్లు, సీసీటీవీ ఫుటేజీలు, ఫేషియల్ రికగ్నిషన్‌తో చేధించిన పోలీసులు

పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలింపు

డైలీ భారత్, జీడిమెట్ల: పోలీసుల వేషధారణలో తిరుగుతూ వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్‌లు, దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నకిలీ పోలీసుల ముఠాను జగద్గిరిగుట్ట పోలీసులు, కూకట్పల్లి సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అరెస్టు చేశారు. ముఠాకు చెందిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి తుపాకులు, ఖాకీ యూనిఫాంలు, ఫేక్ ఐడీ కార్డులు, హ్యాండ్‌కఫ్స్, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటిరెడ్డి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

జైలు పరిచయం.. నేరాలకు పునాది

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రౌడీషీటర్ నాగరాజు రఘువర్మ అలియాస్ కార్తికేయ (ఏ-1), హరియాణాకు చెందిన సస్పెండెడ్ కానిస్టేబుల్ సునీల్ కుమార్ తదితరులు గతంలో జైలులో పరిచయం అయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత నాగరాజు మాస్టర్‌మైండ్‌గా, సునీల్ కుమార్ పోలీసు విధానాలపై అవగాహనతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఫేక్ పోలీసు గుర్తింపు కార్డులు, ర్యాంక్ బ్యాడ్జీలు, తుపాకులు, హ్యాండ్‌కఫ్స్ సమకూర్చుకుని తమ వాహనాల్లోనే ఒక నకిలీ పోలీసు వ్యవస్థను సృష్టించారు.

వ్యాపారిని కిడ్నాప్ చేసి రూ.5.26 లక్షల దోపిడీ

కూకట్పల్లిలోని జయనగర్‌కు చెందిన వ్యాపారి కావూరి పూర్ణచంద్రరావును లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా, మే 18, 2026న జగద్గిరిగుట్ట శోభోదయ కాలనీ సమీపంలో అతడిని అడ్డగించింది. తాము హరియాణా పోలీసులమని, అతనిపై క్రిమినల్ కేసు నమోదైందంటూ బెదిరించారు. నమ్మకం కలిగించేందుకు వీడియో కాల్ ద్వారా మరో వ్యక్తిని ఉన్నతాధికారిగా పరిచయం చేశారు. అనంతరం బాధితుడిని బలవంతంగా కారులో ఎక్కించుకుని సూర్యాపేట వైపు తీసుకెళ్లారు. మార్గమధ్యలో బెదిరింపులకు గురిచేస్తూ ఏటీఎంల ద్వారా నగదు డ్రా చేయించడంతో పాటు ఫోన్‌పే, ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీల ద్వారా మొత్తం రూ.5.26 లక్షలు దోచుకున్నారు. అనంతరం అతడిపై దాడి చేసి మొబైల్ సిమ్ కార్డు లాక్కొని, ఒక సాధారణ ఫోన్ ఇచ్చి నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి పరారయ్యారు.

టెక్నాలజీతో ఛేదించిన పోలీసులు

బాధితుడి ఫిర్యాదు మేరకు జగద్గిరిగుట్ట పోలీసులు, కూకట్పల్లి సీసీఎస్ బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. సీసీటీవీ ఫుటేజీలు, ట్రాఫిక్ చలాన్లు, మొబైల్ డేటా విశ్లేషణ, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (యాంబిస్ యాప్) సహాయంతో నిందితుల కదలికలను గుర్తించారు. పక్కా ఆధారాలతో ముఠా సూత్రధారి నాగరాజు రఘువర్మతో పాటు యశ్వంత్ సింగ్, సత్యభాన్ సింగ్, నాగేంద్ర వర్మలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి ఖాకీ యూనిఫాంలు, నకిలీ ఐడీ కార్డులు, తుపాకులు, హ్యాండ్‌కఫ్స్, మొబైల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముఠాకు శిక్షణ ఇచ్చిన సస్పెండెడ్ కానిస్టేబుల్ సునీల్ కుమార్, మరో సభ్యుడు ప్రదీప్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నేర చరిత్ర కలిగిన ముఠా

ముఠా ప్రధాన సూత్రధారి నాగరాజు రఘువర్మపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కలిపి 12 కేసులు నమోదై ఉన్నాయని డీసీపీ తెలిపారు. గతంలో మాదాపూర్, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ల పరిధిలో అతనిపై రెండుసార్లు పీడీ యాక్ట్ నమోదైంది. పోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్‌గా కూడా గుర్తింపు పొందాడు. అరెస్టైన మరో నిందితుడు యశ్వంత్ సింగ్ గతంలో చోరీ కేసులో నిందితుడిగా ఉండగా, పరారీలో ఉన్న ప్రదీప్ కుమార్ మిశ్రాపై తెలంగాణలోనే 14 ఆస్తి నేర కేసులు ఉన్నాయి. సత్యభాన్ సింగ్‌పై దుండిగల్, ఆర్సీ పురం పోలీస్ స్టేషన్లలో దోపిడీ కేసులు నమోదు కాగా, నాగేంద్ర వర్మపై అబిడ్స్, చిలకలగూడ, సైదాబాద్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐదు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

అప్రమత్తంగా ఉండాలి : డీసీపీ

పోలీసుల పేరుతో ఎవరైనా వచ్చి విచారణ పేరుతో తీసుకెళ్లాలని ప్రయత్నించినా, డబ్బులు డిమాండ్ చేసినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను లేదా డయల్-100ను సంప్రదించాలని డీసీపీ కోటిరెడ్డి ప్రజలకు సూచించారు. పోలీసుల వేషధారణలో నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దర్యాప్తు బృందానికి డీసీపీ అభినందనలు..

ఇక కేసు చేదనలో సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి, అడిషనల్ డీసీపీ పురుషోత్తం పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించిన అధికారులు కుత్బుల్లాపూర్ ఎ సి పి బాలగంగి రెడ్డి, నాగేశ్వర్ రావు (క్రైమ్స్ ఏసీపీ), పి. నరేంద్ర రెడ్డి (జగద్గిరిగుట్ట డీఐ), కె. రవికుమార్ (సీసీఎస్ ఇన్స్పెక్టర్), కానిస్టేబుళ్లు పురాన్ దాసు, నరేష్, నరేష్ గౌడ్, సుమ, కూకట్పల్లి సీసీఎస్ టీమ్ ఎస్ ఐ నరసింహ, ఎలియాజర్, అర్జున్ కుమార్, అంజి, అస్గర్, చందర్ లను డీసీపీ కోటిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. వారికి రివార్డ్ అందేవిధంగా సిఫార్సు చేయడం జరుగుతుందని తెలిపారు.

Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >