Posted on 2026-06-19 19:13:38
రాష్ట్రంలో దశల వారీగా భూముల రీ సర్వే
వచ్చేనెల నుంచి తొలిదశలో 2240 గ్రామాల్లో ప్రారంభం
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
డైలీ భారత్, హైదరాబాద్: భూ సమస్యలు, భూవివాదాలు లేని తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో భూ సర్వే నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి దశల వారీగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
శుక్రవారం నాడు రెవెన్యూ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మంత్రి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలుండగా తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల నుంచి 70 గ్రామాల చొప్పున మొత్తం 2240 గ్రామాలను ఎంపిక చేసి రీసర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
భూమి రైతుకు కేవలం ఆస్తి మాత్రమే కాదని.. అది అతని జీవనాధారమని ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబర్కు భూదార్, ప్రతి రైతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణను భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఈ రీ-సర్వే కార్యక్రమం చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో 1936 నాటి నిజాం కాలం సర్వే రికార్డులే ప్రధాన ఆధారంగా ఉన్నాయని, కాలక్రమేణా భూముల విభజనలు, ఉపసంఖ్యలు పెరగడం, పట్టణీకరణ విస్తరించడం, పరిపాలనా సరిహద్దులు మారడం వల్ల అనేక ప్రాంతాల్లో భూముల అసలు హద్దులపై స్పష్టత లేకుండా పోయిందన్నారు. ఈ పరిస్థితులకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం సమగ్ర రీ-సర్వే చేపడుతోందని తెలిపారు.
భూ వివాదాల పరిష్కారంలో భాగంగా రాష్ట్రంలో నిజాం కాలం నుంచి నక్షాలు లేని 378 గ్రామాలను గుర్తించామని, వాటిలో ఇప్పటికే 5 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి చేసి భూదార్ నంబర్లు కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన 373 గ్రామాల్లో కూడా రోవర్స్ వంటి ఆధునిక సాంకేతికతతో సర్వే పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
గొలుసులు, కర్రలు, క్రాస్ స్టాఫ్, మెజరింగ్ టేప్ వంటి పాత సర్వే పరికరాలకు పూర్తిగా స్వస్తి చెబుతున్నామని మంత్రి తెలిపారు. డీజీపీఎస్, రోవర్స్, జీఐఎస్, క్యూజీఐఎస్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ శాస్త్రీయ పద్ధతిలో భూముల సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 411 రోవర్స్ కొనుగోలు చేయగా, త్వరలో మరో 400 రోవర్స్ కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రతి సర్వే నంబర్కు భూదార్
భూముల రీ-సర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూకమతానికి ఖచ్చితమైన హద్దులను నిర్ణయించి, ప్రతి సర్వే నంబర్కు ప్రత్యేక భూదార్ నంబర్ కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆధార్ తరహాలో ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపుగా భూదార్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. డీజీపీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని క్యూజీఐఎస్ సాఫ్ట్వేర్లో నిక్షిప్తం చేసి భూ భారతి పోర్టల్లో నమోదు చేయనున్నట్లు తెలిపారు.తెలంగాణ ప్రాంతంలో 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వే నంబర్లు ఉండగా, ప్రస్తుతం అవి 2 కోట్ల 29 లక్షలకు పెరిగాయని రాష్ట్రంలోని అన్ని సర్వే నంబర్లకు దశలవారీగా భూదార్ నంబర్లు కేటాయించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ రూపొందించిందన్నారు.
రీ-సర్వే కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన మానవ వనరులను ప్రభుత్వం సమకూర్చిందని, 5,520 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి లైసెన్సులు జారీ చేశామని, భూవిస్తీర్ణాన్ని బట్టి ప్రతి మండలానికి 4 నుంచి 6 మంది సర్వేయర్లను నియమించామని చెప్పారు. రాష్ట్రంలోని రెవెన్యూ గ్రామాలను క్లస్టర్లుగా విభజించి ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
భూముల రీ-సర్వే పూర్తయిన తర్వాత ప్రతి కమతానికి ఖచ్చితమైన సరిహద్దులు, ప్రత్యేక పటాలు సిద్ధమవుతాయని, తద్వారా భూ యాజమాన్యంపై ఎలాంటి వివాదాలకు తావు ఉండదన్నారు. భూ భారతి చట్టం ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే పటం తప్పనిసరి చేసిన నేపథ్యంలో రీ-సర్వే ద్వారా భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారనున్నాయని తెలిపారు.
గాంధారి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >
హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు
Posted On 2026-06-19 16:24:52
Readmore >