Posted on 2025-12-19 19:45:18
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్ : ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్ధవంతంగా ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఈ నెల 22వ తేదీన జిల్లాలో ప్రయోగాత్మక రీతిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న టేబుల్ టాప్ (మాక్) ఎక్సర్ సైజ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వరదలు, పారిశ్రామిక ప్రమాదాలు, విపత్తులు సంభవించిన సమయాలలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం నివారించేందుకు చేపట్టాల్సిన తక్షణ చర్యలపై సన్నద్ధతను పెంపొందించేందుకు వీలుగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ) సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22న అన్ని జిల్లాలలో మాక్ ఎక్సర్ సైజ్ ను నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపధ్యంలో శుక్రవారం హైదరాబాద్ లోని టీ.జీ.ఐ.సి.సి.సి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఎన్.డీ.ఎం.ఎ మేజర్ సుధీర్, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ హసనైన్, తెలంగాణ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ నారాయణరావు, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ ఇతర ఉన్నథాధికారూలతొ కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మాక్ ఎక్సర్ సైజ్ చేపట్టాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీ.ఎస్, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఉన్నతాధికారులు దిశా నిర్దేశం చేశారు. విపత్తులు సంభవించిన సమయంలో సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉన్నామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇటీవల ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఎగువన గల మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టుతో పాటు, నిజాంసాగర్ రిజార్వాయర్ ద్వారా నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరిందని అన్నారు. ఎగువ ప్రాజెక్టుల నుండి నీటి విడుదల స్థితిగతుల గురించి ముందస్తుగానే సమాచారం సేకరిస్తూ తదనుగుణంగా ఎస్సారెస్పీ ద్వారా దిగువకు మిగులు జలాలు విడుదల చేశామని తెలిపారు. అయితే శ్రీరాంసాగర్ నీటి నిలువ (బ్యాక్ వాటర్) ప్రాంతాలైన ఆరు గ్రామాలు వరద తాకిడి ఎక్కువ కావడం వల్ల ముంపు ప్రభావానికి గురయ్యాయని, తక్షణ సహాయక చర్యలు చేపట్టి ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించగలిగామని కలెక్టర్ తెలిపారు. కాగా, వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి విపత్తుల నిర్వహణపై చేపట్టనున్న మాక్ ఎక్సర్ సైజ్ కార్యక్రమం ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఇటీవలే నిజామాబాద్ సహా రాష్ట్రంలోని సుమారు 10 జిల్లాలలో భారీ వర్షాల కారణంగా వరద పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అదేవిధంగా పలు పరిశ్రమలలో ప్రమాదాలు చోటుచేసుకుని మరణాలు సంభవించాయని, బస్సు దగ్ధం వంటి విపత్తులు జరిగి ప్రయాణికులు మృతి చెందారని అన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విపత్తుల నిర్వహణ విషయంలో అప్రమత్తతను పెంపొందించేందుకు ఈ నెల 22న మాక్ ఎక్సర్ సైజ్ నిర్వహించాలని ఆదేశించిందని అన్నారు. ఇది ప్రయోగాత్మక కార్యక్రమం అయినప్పటికీ పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. విపత్తులు సంభవించినప్పుడు అందుబాటులో ఉండే వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడం, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడం, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం, లోలెవల్ వంతెనలు, కాజ్ వేల గుండా రాకపోకలను నిషేధించడం, ఎస్.డీ.ఆర్.ఎఫ్ బృందాలు తక్షణ సహాయక చర్యలు చేపట్టడం, అంబులెన్సులు, లైఫ్ బోట్స్, లైఫ్ జాకెట్స్ అందుబాటులో ఉంచడం, రెస్క్యూ టీంలు, మెడికల్ టీంలను ఏర్పాటు చేయడం, ఇతర సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సి ఉంటుందన్నారు. తద్వారా ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ఎక్కువగా ఆస్కారం ఉంటుందని అన్నారు. 22వ తేదీ నాటి మాక్ ఎక్సర్ సైజ్ సందర్భంగా ఈ తరహా అన్ని చర్యలు ప్రయోగాత్మకంగా చేపట్టేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మాక్ ఎక్సర్ సైజ్ ను నిర్వహించడం వల్ల విపత్తులను ఎదుర్కొనే విషయంలో ఏ మేరకు సన్నద్ధత కలిగి ఉన్నామనే విషయం వెల్లడి అవుతుందని, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరి చేసుకునేందుకు, అవసరమైన పరికరాలను సమకూర్చుకునేందుకు అవకాశం కలుగుతుందని కలెక్టర్ తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సంబంధిత శాఖల అధికారులు అందరూ మాక్ ఎక్సర్ సైజ్ ను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని, క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలు అందించేలా వైద్య బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విపత్తుల సమయంలో నీటిపారుదల, అగ్నిమాపక, విద్యుత్, రహదారుల, పోలీస్, రెవెన్యూ, వైద్య, పౌరసరఫరాల తదితర శాఖల అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, అదనపు డీ.సీ.పీ బస్వారెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి పరమేశ్వర్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, పరిశ్రమల శాఖ రీజినల్ డిప్యూటి చీఫ్ ఇన్స్ పెక్టర్ లక్ష్మి, కలెక్టరేట్ విపత్తుల నిర్వహణ విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాస్, ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, వైద్యారోగం, పోలీస్, మున్సిపల్ తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >