Posted on 2026-07-07 11:51:25
కన్కల్ గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం..
ప్రైవేట్ స్కూల్ బస్సులకు నో చెప్పిన గ్రామస్తుల
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో విద్యార్థులందరినీ ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. సోమవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి అధ్యక్షతన గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పాఠశాలల్లో కంప్యూటర్లను ఏర్పాటు చేశామని, అవసరమైన మరిన్ని విద్యా సామగ్రి, మౌలిక వసతులు, అదనపు మరుగుదొడ్ల నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపడం వల్ల తల్లిదండ్రులపై అనవసర ఆర్థిక భారం పడుతోందన్నారు. ఆ భారాన్ని తగ్గించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలంటే గ్రామంలోని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని పిలుపునిచ్చారు.
మహిళలు మాట్లాడుతూ, గ్రామానికి ప్రైవేట్ పాఠశాలల బస్సులు వస్తే వాటిని వెనక్కి పంపిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరిచే ఉద్దేశంతో ప్రైవేట్ పాఠశాలల బస్సులను గ్రామానికి తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, అలాంటి చర్యలను సహించబోమన్నారు.
అనంతరం గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కార్యాలయానికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మహేందర్, దేమికలాన్ సింగిల్ విండో ఉపాధ్యక్షుడు పులగం రవీందర్ రెడ్డి, మాజీ పాఠశాల కమిటీ చైర్మన్ మన్నే లక్ష్మి, గ్రామ పెద్దలు కిష్టారెడ్డి, వెంకట్ రెడ్డి, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >